15వ ప్రవాసీ భారతీయ దినోత్సవం వారణాసిలో అట్టహాసంగా ప్రారంభమైంది. మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నౌత్ ఈ ఏడాది సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రారంభోపన్యాసంలో భాగంగా మాట్లాడుతూ ఇలాంటి దినోత్సవాల సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు ఒక్క చోటుకు చేరి మాట్లాడుకునేందుకు చక్కటి అవకాశమని అభివర్ణించారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ సంతతి భారత దేశానికి బ్రాండ్ అంబాసిడర్లని ఆయన అభివర్ణించారు. భారత్తోపాటు వారు నివసిస్తున్న దేశాలకు కూడా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని ఆయన కొనియాడారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వారు తమ పూర్వీకులు నివసించిన మాతృభూమితో సంబంధాలు నెరపడం ఎంతో అవసరమన్నారు.
వాస్తవానికి ప్రవాస భారతీయ దివస్ని ప్రతి ఏటా జనవరి 9వ తేదీన జరుపుతారు. విదేశీ సంతతి భారత దేశానికి అందించిన సేవలు, అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు. అయితే ఈ సారి మాత్రం ప్రవాస భారతీయులు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళను కూడా సందర్శించుకునేలా సదస్సు ఏర్పాటు చేయమని కోరగా తేదీల్లో మార్పు జరిగింది. అంతేకాక సదస్సుకు వచ్చిన్న ప్రతినిధులకు 26 జనవరిన ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవ పరేడ్ను కూడా చూసే అవకాశం లభిస్తుంది.
జనవరి 9వ తేదీని ప్రవాస భారతీయ దినంగా పరిగణనించడానికి కారణం ఉంది. గ్రేట్ ప్రవాసీగా వ్యవహరించే మహాత్మా గాంధీ ఆ రోజునే దక్షిణాఫ్రియా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన స్వాతంత్రోద్యమానికి శ్రీకారం చుట్టి భారత తీయుల జీవితాల్లో మరపులేని మార్పును తీసుకువచ్చారు. ఈ ఏడాది జరుగుతున్న 15వ ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నారు.
ప్రవాస భారతీయ దివస్ని 2003 నుంచి నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సదస్సులు విదేశాల్లో భారతీయ సంతతికి ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి. తమ పూర్వీకులు నివసించిన దేశంతో సంబంధాలు మెరుగుపర్చుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనం పొందే రీతిలో ఇవి ఉపయోగపడుతున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి కూడా ఒకరితో మరొకరు సంబంధాలు ఏర్పర్చుకునేందుకు కూడా ఆ సదస్సులు దోహదపుడుతున్నాయి. వివిధ రంగాల్లోని తమ అనుభవాలను కలబోసుకోవడానికి కూడా ఇది వేదిక అవుతోంది. ఈ ఏడాది జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్కు దాదాపు ఐదు వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని ప్రతిష్టాత్మకమైన ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ఇచ్చి సత్కరిస్తారు. భారత దేశ అభివృద్ధిలో పాలుపంచుకున్న విశిష్ట వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు. ఈ సదస్సు సందర్భంగానే భారతీయ సంతతికి చెందిన కీలకమైన అంశాలపై చర్చిస్తారు.
భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వారివారి దేశాలకు చేసిన సేవలను కూడా గుర్తిస్తూ ప్రతినిధులుగా ఆహ్వానిస్తున్నారు. అంఏతకాక భారతీయ సంతతికి చెందిన ప్రముఖ జాతీయ నాయకులను కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ క్రమంలో మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నౌత్ను ఈ ఏడాది జరిగే 15వ ప్రవాసీ భారతీయ దివస్కు ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్మానం పలికారు. భారతీయ సంతతికి చెందిన అనేక మంది వివిధ దేశాల్లో స్థిరపడి అక్కడ ప్రభుత్వాధినేతలుగా మారారు. అయినా వాళ్లు తమ మాతృ దేశంతో సంబంధాలు కొనసాగించడానికి ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.
మొదటి రోజు కార్యక్రమాన్ని భారతీయ సంతతిలోని యువతకు అంకితం చేశారు. ప్రవాస భారతీయులైన నార్వే పార్లమెంట్ సభ్యుడు హిమాంషు గులాటీ, న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడైన కమల్జీత్ భక్షిలు ఇద్దరు యువకులే. ప్రవాస భారతీయ దినోత్సవ ప్రారంభం రోజైన 21 జనవరి రోజు వారిద్దరు యూత్ సెషన్కు ముఖ్య అతిథులుగా వ్యవహరించారు.
యూత్ ప్రవాసీ భారతీయ దివస్ను విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో భారత దేశానికి చెందిన సంతతే ఎక్కువగా విదేశాల్లో నివసిస్తున్నారని చెప్పారు. సుమారు 31 మిలియన్ భారతీయ సంతతి వివిధ దేశాల్లో ఉన్నారని ఆమె తెలిపారు. ఇండియన్నెస్ అనే స్పూర్తితో వారు తమ మూలాలను మరువకుండా జీవిస్తున్నారని చెప్పారు. ఈ దేశం సుసంపన్నమైన భారతీయ సంతతికి చెందిన పూర్వీకులదనీ, అందుకే వారు ముందుకు వచ్చి తమ మాతృభూమి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారని కొనియాడారు. శతాబ్ధాల క్రితం భారతీయ సంతతి సుదూర తీరాలైన ఫిజీ, మారిషస్, సునామె,
శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, గయానా, మలేషియా, మయన్మార్లతోపాటు ఆఫ్రికా దేశాలకు కూడా తరలిపోయారన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా ఈ వలసలు విద్య, నైపుణ్యాల కోసం కొనసాగుతున్నాయన్నారు. ఉత్తేజితులైన యువత భారత దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారని ఆమె అభినందించారు. భారత ఆర్థిక వ్యవస్థలో సింహ భాగం విదేశీ భారతీయులేనని ఆమె అన్నారు. అందుకే ప్రవాస భారతీయులతో సంబంధాల వల్ల ప్రయోజనం ఎంతో ఉందని భారత్ వారి ప్రాధాన్యత గుర్తించింది. ఆధ్యాత్మిక మాతృభూమికి వారందిస్తున్న సేవల్ని శ్లాఘిస్తోంది.
రచన : రంజిత్ కుమార్, సీనియర్ జర్నలిస్టు