16వ లోక్సభ (పార్లమెంటులో దిగువ సభ) చివరి సమావేశాలు ముగిసాయి. బుధవారంతో అటు లోక్సభ, ఇటు రాజ్యసభ (ఎగువ సభ)లు రెండూ నివధికంగా వాయిదా పడ్డాయి. దేశంలో కొద్ది నెలల్లో 2019 సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసాయి.
రెండు వారాల పాటు కొనసాగిన సమావేశాల్లో ముగింపు ఉపన్యాసం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తన ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. సభలో ఉన్న సభ్యులందరినీ ఆయన అభినందించారు. చారిత్రాత్మకమైన పలు బిల్లులకు ఆమోదం తెలిపినందుకు అభినందనలు తెలియజేశారు. 85 శాతం హాజరు ఉన్నందుకు కూడా ఆయన సభ్యుల్ని అభినందించారు. 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగానే దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయడం సాధ్యమైందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భారత దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన ఘనతను తాను కానీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కానీ తీసుకోమనీ, ఆ ఘనత ఈ దేశ ప్రజలకే దక్కుతుందని ఆయన ప్రకటించారు. ప్రజలు పూర్తి మెజారిటీ ఇస్తూ తమను ఎన్నుకోవడం ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పారు.
తన ప్రభుత్వ విజయాలను గురించి మోదీ మాట్లాడుతూ బారత దేశం ఇపుడు ప్రపంచంలోనే ఆరవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకునే దిశగా పరుగులు పెడుతోందని తెలిపారు. భారత దేశానికి ఉన్న ఆత్మ విశ్వాసమే ఈ అభివృద్ధికి కారణమని ఆయన అన్నారు. ఆత్మ విశ్వాసం ఉన్నపుడు లక్ష్యాలను చేరుకోవడం సుళువవుతుందని అన్నారు. లోక్సభలో 219 బిల్లులు ప్రవేశపెట్టగా 203 బిల్లులు ఆమోదానికి నోచుకున్నాయని ఆయన ప్రకటించారు. ఆమోదం పొందిన బిల్లులు నల్లధనం అరికట్టే బిల్లు కూడా ఉందన్నారు.
2019 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో సమాధానం ఇస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశం పురోగమన దిశలో పయనిస్తోందని అన్నారు. ప్రభుత్వం సాధించిన అతి ముఖ్యమైన విజయాల్లో ద్రవ్యలోటును 3.4గా స్థిరీకరించడం ఒకటని అన్నారు. గత నెల ద్రవ్యోల్బణం 2.19కి తగ్గిందని వివరించారు. ఫైనాన్స్ బిల్లులోని ప్రతిపాదనలు మధ్య తరగతిని, నిజాయితీతో పన్నులు చెల్లించే వారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించామన్నారు. వస్తు సేవల పన్ను విషయంలో ప్రభుత్వం చిరు వ్యాపారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు చేస్తోందన్నారు.
ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిమ్న, మధ్యంతర ఆదాయ వర్గాలకు సొంత ఇల్లు సమకూర్చే దిశలో పథకాలు రూపొందించిందన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద వారు సొంత గృహాలు సమకూర్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి దేశంలో ప్రతి పౌరుడు తన సొంత ఇంటిని కలిగి ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించు. పన్ను చెల్లింపుదారులు తమ కష్టార్జితాన్ని సేవింగ్స్, మెడిక్లెయిమ్, లేదా ఎడ్యుకేషన్ లోన్ల రూపంలో దాచుకోవాలనుకుంటే రూ. 9.5 లక్షల సొమ్ముపై ఆదాయపు మినహాయింపు పొందవచ్చునన్నారు. గత ప్రభుత్వాలు తమ పదేళ్ల సుదీర్ఘ కాలంలో రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలు అందించలేదని ఆయన ఆరోపించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం తన హాయాంలో రైతుల కోసం ఎన్నో ప్రయోజనాలు ప్రకటించిందన్నారు. ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచిందని తెలిపారు.
గోయల్ మాట్లాడుతూ తమ బడ్జెట్లో మధ్య తరగతికి లాభం కలిగించే రీతిలో పన్ను ప్రయోజనాలను పొందుపరిచామన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వల్ల రైతులకు ఆహార భద్రత కలుగుతుందని ఆయన అన్నారు. మధ్యంతర బడ్జెట్లో పేద రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్కువగా అంచనా వేయకూడదన్నారు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు.
ప్రవాస భారతీయులకు మ్యారేజీ రిజిస్ట్రేషన్పై ‘ది రిజిస్ట్రేషన్ ఆఫ్ నాన్-రెసిడెంట్ ఇండియన్ బిల్-2019ని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్య సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మాయమవుతున్న ఎన్నారై భర్తలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. చాలా మంది ఎన్నారై భర్తలు తమ భార్యలను వదిలి విదేశాలకు పారిపోతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఎన్నారై భర్తలు కోర్టు సమన్లకు స్పందించకపోతే వాళ్ల పాస్పోర్టులను జప్తు చేయడం, వారిని అబ్స్కాండర్లుగా ప్రకటించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. పెళ్లయిన వారం రోజుల్లో ఎన్నారైలు తమ మ్యారేజీని రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధనను ఈ బిల్లులో చేర్చారు.
రాజ్యసభలో ‘ది కానిస్టిట్యూషన్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (థర్డ్ అమెండ్మెంట్) బిల్లు 2019 ఆమోదం పొందింది. అరుణాచల్ ప్రదేశ్లోని షెడ్యూల్డ్ ట్రైబ్ల జాబితాను సవరించేందుకు గాను ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ఒక్కసారి చట్టం రూపం ధరించగానే కొత్తగా షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితాలో చేరిన వారు ఇతర ఎస్టీల తీరులోనే ప్రస్తుతం మనుగడలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులవుతారు.
రచన : వి.మోహన్ రావు, జర్నలిస్టు