ఆహార లేమి ప్రపంచమంతటా పెద్ద సవాలుగా నిలిచింది. పెరుగుతున్న జనాభా, అధికమవుతున్న ఆదాయం, మారుతున్న డైట్ విధానాలు, పడిపోతున్న జలవనరులు, ఆహారం లేక అలమటిస్తున్న రోజులు నానాటికీ అధికమవడం, సాగునీటి వనరుల తరుగుదల, నానాటికీ ఎక్కువ ప్రమాణాలలో కోతకు గురవుతున్న భూమి, వాతావరణ మార్పుల వల్ల తరుగుతున్ననీటి నిల్వలు వంటివి ఆహార భద్రతా లేమిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ప్రధానంగా ఈ తరహా పరిస్థితులు అభివృద్ధి దిశగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థతల్లో అధికంగా చూస్తున్నాం.
ప్రపంచమొత్తం అందరికీ సరిపడా అధికపాళ్లల్లో తగినంత ఆహారోత్పత్తి జరిగినా కూడా, ఆహారలేమిని ఎదుర్కొంటున్న ప్రజలు సంఖ్య అధికసంఖ్యలో ఉంటున్న విచిత్ర పరిస్థితి ఉంది. పేదరికం, ఆకలిని తగ్గించేందుకు అధికస్థాయిలో ప్రగతి సాధించాం. అంతేకాదు ఆహార భద్రత, పోషకవిలువలు కూడా బాగా మెరుగుపడ్డాయి. ఉత్పత్తిలో లాభాలతో పాటు, వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా సాంకేతిక ప్రగతిని సైతం సమర్థ వంతంగా ఉపయోగించుకుంటున్నాం. ఇవి ఆహార భద్రతను మెరుగుపరుస్తున్నాయి. అయినా కూడా ఈ సమస్యకు సంబంధించి ప్రధానమైన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటీవల ఆహార సంక్షోభంపై వచ్చిన గ్లోబల్ నివేదిక సైతం ప్రపంచంలోని 53 దేశాలలోని 113 మిలియన్ల మంది ప్రజలు ప్రపంచంలోనే అత్యంత తీవ్రతరమైన ఆహార సంక్షోభాన్ని గత ఏడాది ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. అంతేకాదు మరో 42 దేశాలలోని 143 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆకలిని ఎదుర్కొనేందుకు కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నారని కూడా గ్లోబల్ నివేదిక పేర్కొంది. వాతావరణంలోని మార్పులు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా 2018 సంవత్సరంలో 29 మిలియన్ల మంది తీవ్ర ఆహారలేమిలోకి నెట్టబడ్డారని కూడా రిపోర్టు పేర్కొంది.
ఈ రిపోర్టులో ప్రపంచంలోని తీవ్ర ఆహార అత్యవసరపరిస్థితిని వెల్లడించే స్నాప్షాట్లను కూడా ఉంచారు. తీవ్ర ఆకలి బాధలను ఎదుర్కొంటున్న 2/3 వంతు జనాలు కేవలం ఎనిమిది దేశాలలో కేంద్రీకృతమై ఉన్నారు. ఆ దేశాలు ఆఫ్ఘనిస్తాన్, ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, నైజీరియా, దక్షిణ సుడాన్, సుడాన్, సిరియా, యెమన్లు. పదిహేడు దేశాలలో ఆకలి బాధలతో ఉన్నవారి సంఖ్య అంతే ఉంటుంది లేదా వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సైతం ఆ నివేదికలో పేర్కొన్నారు.
ప్రపంచంలో తీవ్ర ఆహార లేమితో తల్లడిల్లుతున్న మొత్తం జనాభాలో సగం మందికి పైగా ఆఫ్రికాలోనే ఉన్నట్టు ఈ గ్లోబల్ నివేదిక పేర్కొంది. తీవ్రస్థాయిలో ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న వారు అధిక సంఖ్యలో తూర్పు ఆఫ్రికాలో ఉంటే, తర్వాతి స్థానంలో దక్షిణ ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, సాహెల్లలో ఉన్నారు. ఏడు మధ్యప్రాశ్చ దేశాలు లేదా ప్రాంతాలలో మొత్తం గ్లోబల్ స్థాయిలో 24 శాతం మంది ఉన్నారు. దక్షిణ, ఆగ్నేయాసియా లకు చెందిన నాలుగు దేశాలలో(మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్) ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న వారి సంఖ్య 13 శాతం ఉంది. మిగిలిన ఐదు శాతం మంది ఉక్రైన్, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాలలో ఉన్నారు.
ఈ నివేదికను యురోపియన్ కూటమి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ (ఎఫ్ఎవొ), యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యుఎఫ్పి)లు కలిసి సమిష్టిగా ఈ వారం బ్రసెల్స్ లో సమర్పించాయి.
ఆహార అభద్రతకు కారణమైన వాటిల్లో వాతావరణ సంబంధిత వైపరిత్యాలతోపాటు, ఆర్థిక సంక్షోభాలు, అస్థిరత, ఘర్షణలు, నిరాశ్రయిలు కావడం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల జీవనశైలి నాశనమవుతోంది. జీవితాలు నాశనమవుతున్నాయి. అంతేకాదు ఆర్థికంగా ఎదుర్కొంటున్న అనూహ్య పరిణామాలు కూడా తీవ్ర ఆహార భద్రతా లేమికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులు ప్రధానంగా బురుండి, సుడాన్, జింబాబ్వే దేశాలలో చూస్తాం.
2019లో ఆహార భద్రతా లేమి, పోషకాహార లేమి స్థితిగతులను అంచనా వేస్తూ ఈ రిపోర్టు మరో కొన్ని ముఖ్య అంశాలను కూడా పేర్కొంది. సంఘర్షణలు, అస్థిరత వల్ల ప్రధానంగా ఆహార భద్రతా లేమి సంక్షోభం తీవ్రతరమవుతోందని ఇందులో పేర్కొన్నారు. ఘర్షణలు, స్థానిక అభద్రతలు, రాజకీయ అస్థిరత వంటివి ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీస్తాయి. లేదా పెరుగుదల క్షీణించిపోయే అవకావం ఉంటుందని నివేదిక వెల్లడించింది.
వ్యవసాయరంగంపై వాతావరణ మార్పుల తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతేకాదు 2019లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని పశుసంపద ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ ప్రభావాలు ఆహార భద్రతపై అతి సహజంగా పడతాయి. ఈ పరిస్థితులు మానవ జీవన ప్రమాణాలను క్షీణింపచేస్తాయి. ద్రవ్య లోటును పెంచుతాయి. ఆహార సంక్షోభ నివారణలో ప్రభుత్వం శక్తివంతంగా స్పందించే సామర్థ్య శక్తిని తగ్గిస్తాయని నివేదిక హెచ్చరించింది.
ఈ నిరాశకర పరిస్థితుల్లో, ముందుకుసాగడానికి ఏదైనా మార్గం ఉందా? ఘర్షణల నివారణకు, మహిళా సాధికారతకు, పిల్లలను ఆరోగ్యంగా పెంచడంతోపాటు విద్యావంతులను చేయడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సోషల్ సేఫ్టీ నెట్స్ ను తిరిగి చేపట్టడం వంటి వాటి వల్ల సుస్థిర, ఆకలి రహిత ప్రపంచం సాధ్యమవుతుందని నివేదిక అభిప్రాయపడింది. వీటితో పాటు, సంఘర్షణాత్మక ప్రాంతాలలో పెట్టుబడులు, సుస్థిర శాంతి వంటివి మానవజీవితాలను, జీవనోపాధి అవకాశాలను సంరక్షిస్తాయి. నిర్మాణాత్మకమైన లొసుగులతో పాటు ఆకలి సమస్యకు ప్రధాన కారణాలను తగ్గిస్తాయి. ఫలితంగా పాజిటివ్ పరిస్థితులు నెలకొంటాయి.
ఆహార సంక్షోభం తీవ్రంగా ఉండడమే కాదు ఇది ఎంతో సంక్లిష్టమైన సమస్య కూడా. ఈ సమస్యను పరిష్కరించడానికి వినూత్న మార్గాలను అన్వేషించాలి. ఆ పరిస్థితులు తిరిగి సంభవించకుండా అడ్డుకోవాలి. ఆహార సంక్షోభంలో నిక్షిప్తమై ఉన్న మానవీయ కోణంతోపాటు, అభివృద్ధి సాధన కోసం సమైక్యంగా స్పందించి, తగిన చర్యలను చేపట్టాలి. గ్లోబల్ నివేదికలో పేర్కొన్న పలు అంశాలు పటిష్టమైన సహకారం అవసరానికి పిలుపునిస్తున్నాయి. తద్వారా ఈ సమస్యను కలిసికట్టుగా అడ్డుకోవడమే కాకుండా, మానవతా అవసరాలపై, ఈ సమస్య మూలకారణాల పరిష్కార సంసిద్ధతపై దృష్టి సారించవచ్చు.
ఎఫ్ఎవొ డైరక్టర్ జనరల్ గ్రజియానొ డా సిల్వా మాట్లాడుతూ ‘‘మానవీయ-అభివృద్ధి-శాంతి అనే మూడు అంశాలతో కూడిన పథం ద్వారా దెబ్బతిన్న, క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్న జనాభా సుస్థిర నిర్మాణ దిశగా అందరం అంతటా స్పందించాలి. జీవితాలను రక్షించాలంటే జీవనోపాధులను కూడా మనం పరిరక్షించుకోవాల్సి ఉంటుంది.
రచన: కె.వి. వెంకటసుబ్రమణియన్, సీనియర్ పాత్రికేయులు