పాకిస్తాన్ వికారమైన క్రీడను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ముల్తాన్లో భారత్కు వ్యతిరేకంగా అర్థరహిత ఆరోపణలు చేశారు. రెండు దేశాల మధ్య పుల్వామా అనంతర ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో సంబంధాలు కలుపుకోవడానికి న్యూఢిల్లీ ఎక్కువగా ప్రయత్నిస్తోం దంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖురేషి చేసిన అర్థరహిత, బాధ్యతారాహిత్య ప్రకటనను భారత్ తీవ్రంగా నిరశించింది. ఖురేషి వ్యాఖ్యలకు గట్టిగా బదులు ఇస్తూ ‘ ఖురేషీ ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను ఇండియాపై దాడికి పురిగొల్పేలా ఉందంటూ భారత్ బదులు ఇచ్చింది. ఇలాంటి వెర్రిమొర్రి ప్రేలాపనలు చేయడానికి బదులు తన నియంత్రణలో ఉన్న అన్ని ప్రాంతాలలోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా విశ్వసనీయమైన చర్యలను పాకిస్తాన్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ వ్యాఖ్యానించింది. ప్రాంతీయ రక్షణ పరంగా ఉగ్రవాదం, సరిహద్దు తీవ్రవాదం ఎంతో ప్రమాదకరమైనవి.
ఖురేషి ప్రకటన విద్వేషపూరితంగా ఉంది. పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీలో భారత్ పట్ల కొనసాగుతున్న కక్షపూరిత వైఖరిని కూడా ఈ ప్రకటన ప్రతిఫలిస్తోంది. అంతేకాదు పలు అంశాలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి ఖురేషిల వైఖరి ఒకే తీరులో లేవన్న వార్తలు కూడా సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
ఖురేషి తీవ్రమైన రాజకీయ కోరికలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్లో కొనసాగుతున్న ఒక విషాదకర పరిస్థితి ఏమిటంటే భారత్కు వ్యతిరేకంగా వచ్చిన ఏ రాజకీయ ప్రకటనకైనా జేజేలు పలికే వారు అక్కడ ఎక్కువ. ఖురేషి కూడా ఇదే రకమైన ఆటను కొనసాగిస్తున్నారు. బాధ్యతాయుత విదేశాంగమంత్రిగా ఖురేషి ఈ తరహా ఆరోపణలను చేయడం ఏమాత్రం వాంఛనీయం కాదు.
ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే భారత్ ఎన్నడూ ఏ దేశం పట్ల దుష్ప్రచారంతో వ్యవహరించింది లేదు. ఐదు వేల సంవత్సరాల భారత పురాతన చరిత్రలో భారత్ ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించలేదు. అయితే, బాధ్యతాయుతమైన దేశంగా బహిరంగ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు విషయంలో భారత్ ఎన్నడూ సర్దుబాటుకు తావివ్వలేదు. పాకిస్తానే 1948, 1965, 1971, 1999 సంవత్సరాలలో భారత్పై దాడులకు పాల్పడింది. ఈ నాలుగు దాడుల సందర్భాలలో కూడా పాకిస్తాన్ కుట్రలను, దాడులను భారత్ ఎంతో సమర్థవంతంగా అడ్డుకుంది. అమెరికా, చైనా దేశాలలో శిక్షణ పొందిన పాకిస్తాన్ సైన్యం భారత సైనిక దళ శక్తిసామర్థ్యాలతో సమమైన రీతిలో వ్యవహరించలేకపోవడం ఛేదించలేని పెద్ద రహస్యమే.
పాకిస్తాన్తో నాలుగు యుద్ధాలు చేయాల్సి వచ్చినా, భారత్ ఇప్పటికీ పొరుగుదేశమైన పాకిస్తాన్తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి అడుగులు వేస్తూనే వస్తోంది. భారత దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు పాకిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగించడానికి సంసిద్ధతను వ్యక్తంచేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ స్థావరంగా కొనసాగు తున్న ఉగ్ర కార్యకలాపాలకు ఆ దేశం పూర్తిగా స్వస్తి పలికేంతవరకూ రెండు దేశాల మధ్య చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పాయి.
మరోవైపు, పాకస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అక్కడి రాజకీయ పక్షాలు భారత వ్యతిరేక పంథానే అనుసరిస్తున్నాయి. భారత వ్యతిరేక ప్రకటనలు చేసిన పాకిస్తాన్ రాజకీయ నాయకులు రాజకీయపరంగా ముందుకు దూసుకువెళ్లిన విషయం బహిరంగ రహస్యమే. గతంలో పాకిస్తాన్ రాజకీయనాయకులు భారత్కు వ్యతిరేకంగా ఎంతో తీవ్రమైన ప్రకటనలే గుప్పించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ ఆలి భుట్టో ‘భారత్కు వ్యతిరేకంగా వెయ్యి సంవత్సరాలు యుద్ధం’ అనడం ఎలా మర్చిపోగలం? అంతేకాదు ‘అణుబాంబు తయారీ కోసం పాకిస్తాన్ గడ్డి తినడానికి కూడా సిద్ధం’ అన్న వ్యాఖ్యలు అంతే. ఇలాంటి భారత్ వ్యతిరేక ప్రకటనలు ఉదాహరణలుగా ఎన్నైనా చెప్పొచ్చు. పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి ప్రకటనల తీరు చూస్తే పాకిస్తాన్ రాజకీయనాయకులకు అభివృద్ధి ఎజెండాతో అవసరం లేదని విస్పష్టమవుతోంది. అధికారంలో కొనసాగడానికి భారత వ్యతిరేక పంథాను కొనసాగించడమే వారి పంథా.
అలాంటి భరించలేని ప్రకటనలను పాక్ గుప్పించినా, పాకిస్తాన్ రాజకీయ నాయకులు తమ ప్రతిన అయిన ‘వన్ యూనిట్’ (వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్)ని నిలుపుకోలేక పోయారు. దేశం ఏర్పడి 24 సంవత్సరాల అనంతరం భాషా సమస్య కారణంగా ‘వన్ యూనిట్’ ప్రతిన ముక్కచెక్కలైంది. ఈ పరిస్థితికి పాకిస్తాన్ సైన్యం, రాజకీయనాయుకులే కారణం. భుట్టో లాంటి కొందరు తమ చర్యలకు ఫలితం అనుభవించారు. బంగ్లాదేశ్ ఏర్పడడం చూసిన పాకిస్తాన్ సైనిక నియంత యాహ్యా ఖాన్ ఎంతో అవమానాల పాలయ్యాడు. పతకాలన్నీ పోగొట్టుకున్నాడు. అనాథ వ్యక్తిగా ఎవ్వరికీ గుర్తుకు రాని రీతిలో మరణించాడు.
పాకిస్తాన్ ఒక దేశంగా అస్తిత్వ సంక్షోభం ఎదుర్కొంటూ వస్తోంది. మత ప్రాతిపదికగా గుర్తింపుపొందింది. వీటన్నింటికన్నా కూడా పాకిస్తాన్ పాలకులు తమ లక్ష్యం కోసం మతాన్ని పావుగా ఉపయోగించుకున్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఈరోజు పాకిస్తాన్ ప్రాధాన్యం పుట్టి మునిగింది చందాన ఉంది. అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు పాకిస్తాన్ ప్రతి చర్యను గమనిస్తున్న పరిస్థితిని నేడు చూస్తున్నాం. అందుకే పాకిస్తాన్ తన పంథాను మార్చుకోని పక్షంలో దాని కథ మరింత సంక్లిష్ట మవుతుంది.
రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్ వ్యూహాత్మక విశ్లేషకులు