ప్రెసిడెంట్ ఒమర్ ఆల్-బషీర్ మూడు దశాబ్దాల పాలనలో కన్నా గత వారంలోనే సూడాన్లో పెను మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. గత కొన్ని నెలలుగా అక్కడ నిరంతరాయంగా ప్రజా నిరసనలు చోటుచేసుకుంటున్న ఫలితంగా ఈ నెల ప్రారంభంలో తిరుగుబాటు జరిగి ఒమర్ ఆల్-బషీర్ పదవీచ్యుతుడయ్యారు.
1989లో అధికారం చేజిక్కించుకున్ననాటి నుంచి దేశం సంక్షోభ పరిస్థితుల్లో మునిగితేలడానికి బషీర్ కారణమయ్యారు. అంతర్యుద్ధం నుంచి బతికి బయటపడ్డారు. దీంతో సూడాన్ భూభాగంలోని మూడవ వంతు ప్రదేశాన్ని నష్టపోవాల్సి వచ్చింది. అలాగే మూడువంతుల చమురు రెవెన్యూ కూడా నష్టపోయారు. ఈ నేపథ్యంలో దక్షిణ సూడాన్ 2011 సంవత్సరంలో స్వాతంత్ర్యాన్ని పొందింది. అంతర్జాతీయంగా సూడాన్ ఒంటరి కావడాన్ని రెండు దశాబ్దాల కాలం బషీర్ తన రాజకీయ ప్రయోజనానికి అనుకూలంగా మలచుకున్నారు. తన వైఫల్యాల నిందలను శత్రు దేశాలపై నెట్టారు.
అయితే బషీర్ రోజులు లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది సూడానీల ముందు అతి పెద్ద కార్యం ఉంది. ఎంతో పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని అధికార దాహంతో ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్న కొంతమంది నాయకుల వైఖరి పట్ల ప్రజలు భయపడుతున్నారు. దేశాన్ని పరిరక్షించుకోవాల్సి సవాలు ప్రస్తుతం సుడానీల ముందు ఉంది.
నిరసనకారులు ప్రారంభంలో కొంతమేర విజయం సాధించారు. అంతేకాదు అధికార పగ్గాలను చేపట్టిన కొత్త ట్రాన్సిషనల్ మిలిటరీ కౌన్సిల్ అధినేతను సైతం తిరస్కరించారు. ఆ అధికారి అంతకు ముందున్న ప్రభుత్వానికి చాలా సన్నిహితమైన వ్యక్తిగా గుర్తింపబడడమే ఇందుకు కారణం. ఒక్కరోజుకే మిలటరీ కౌన్సిల్ అధిపతి పదవీచ్యుతుడయ్యారు ఆ అధికారి.
ముందు ముందు ఇంకా మరిన్ని తీవ్రమైన సవాళ్లు ఎదురుకానున్నాయి. అధికారంలో లేని విప్లవకారులు సైనిక పాలన నుంచి పౌర పాలనకు సమస్యారహితంగా పరివర్తన ప్రక్రియ జరగాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సుడాన్లో శాంతి, సుస్థిరతలతో పాటు ప్రజాస్వామ్యం, సంపదలు నెలకొంటాయి. ఈ సవాలు సాధించడం అంత సులువేమీ కాదు. కారణం ఉద్యమ నాయకుల్లో కొందరు రాజకీయాలకు కొత్తవారు. కుట్రలు, పన్నాగాల్లో చిక్కుకోకుండా, సైన్యం, పాలనలోని అంతర్గత శక్తుల చేతుల్లో దేశాధికారం పడకుండా కాపాడుకోవాలి. రాజకీయాలకు కొత్తవారైన కొందరికి ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న అధికార వ్యవస్థ, నిర్మాణాలు విప్లవాత్మకమైన రీతిలో మారడం ఇష్టం లేదు.
పొరుగున ఉన్న ఈజిప్టు నుంచి, పలు ఇతర దేశాల వరకూ సూడాన్ పాఠం నేర్చుకోవాలి. ఆ దేశాలలో ప్రజల తీవ్ర నిరసనలతో 2011 సంవత్సరంలో అక్కడ సైనిక నియంతృత్వ ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే ఇలా జరగడం వల్ల ఎలాంటి అనుకూల ఫలితాలు సాధారణ ప్రజలకు ప్రాప్తించలేదు.
పరివర్తన అంతర్గతంగా రావాల్సిన అవసరం ఉంది. దేశ ఉద్యమం వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి. యువకలు, మహిళలు, ప్రొఫెషనల్ వర్గాలు, పట్టణ, గ్రామీణ పేదలు బషీర్ని పదవీచ్యుతుడిని చేయడంలో కీలకపాత్ర పోషించారు. నిరసనలను చేపట్టిన వారు దాని తర్వాత దశలో కేంద్రబిందువులుగా మసలాలి. ఎందుకంటే వీధుల్లోకి వచ్చిన ప్రజాసమూహం మిలటరీ కౌన్సిల్పై శక్తివంతమైన ప్రభావం చూపుతుంది. నిజమైన అంతర్గత పరివర్తన క్రమంలో బషీర్ ‘నేషనల్ కాంగ్రెస్ పార్టీ’లోని కొన్ని అంశాలను సైతం చేర్చాల్సిన అవసరం ఉంది.
అయితే పాలనా, ప్రభుత్వ పరివర్తన మొత్తం పౌర సారథ్యంలో జరగడం ముఖ్యం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం కూడా ఉంది. ఒక సైనిక పాలనను మరో వర్గం సైనిక పాలనతో పూరించలేము. ఇది గుర్తుంచుకోవాలి. రానున్న రోజుల్లో శాంతిసుస్థిరతలకు ప్రమాదం కలిగించే ప్రధాన అంశం ఏమిటంటే వివిధ పక్షాల మధ్య చీలికలు సంభవించడం. ఇదే గనుక జరిగితే అది హింసాత్మక సంఘటనలకు దారితీస్తుంది. మార్పు అనేది వేగవంతంగా సుస్థిర మార్గంలో చోటుచేసుకోవాలి. దీనివల్ల పౌర స్వేచ్ఛపై పరిమితులు తొందరగా పోతాయి. అంతేకాదు రాజకీయ స్వేచ్ఛ విస్తరిస్తుంది. కొత్త రాజ్యాంగం రూపుదిద్దుకుంటుంది. దాంతోపాటు స్వేచ్ఛాస్వాతంత్ర్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి.
శాంతి, సుస్థిరత, సమన్యాయాలు అందాలి. మారణహోమం, యుద్ధ నేరాలు, మానవులకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకుగాను బషీర్ను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసిసి) పట్టుకోవాలని భావిస్తోంది. బషీర్పై న్యాయవిచారణ సరిగా జరిగి తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉగ్రపోకడలను సర్వనాశనం చేయాలి. భద్రతా నిర్మాణ పరంగా సమగ్ర సంస్కరణలను అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అమెరికా, యూరప్, జపాన్, ఇండియా, ఇతర దేశాలతో కలిపి మొత్తం అంతర్జాతీయ సమాజం పటిష్టమైన రాజకీయ, దౌత్య, ఆర్థిక మద్దతు సూడాన్ పౌర నాయకత్వానికి అందేలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. సూడాన్ ఆర్థిక వ్యవస్థ మూడొంతులు పూర్తిగా కుప్పకూలింది. అదే సూడాన్లో విప్లవం పుట్టుకురావడానికి కారణమైంది. సూడాన్కు మద్దతునిస్తున్న అంతర్జాతీయ భాగస్వాములు దీనిని పునరుద్ధరించడంలో సహాయపడగలవు. ద్వైపాక్షిక, బహుపాక్షిక రుణసహాయం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవడంతోపాటు, ప్రధాన దాతలతో సహాయ సంబంధాల పునరుద్ధరణ వంటివి సుడాన్ కొత్త నాయకులకు కీలక ప్రోత్సాహకాలని చెప్పాలి.
ఈ పరిస్థితుల్లో ఉద్యమంకు ఇంకా పూర్తి రక్షణ వాతావరణం లేదు. నిరసనకారుల కోరికలను అడ్డుకోవడంలో సూడాన్ సైన్యం, భద్రతా నాయకులది పైచేయి అయింది. కానీ సూడాన్ పౌరులు పట్టువదలకుండా ఎంతో ధైర్యంతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తద్వారా తమ శక్తిని ప్రదర్శిస్తూ తమ నిరసనల సంఘటనలకు ఒక రూపు నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ దేశ మంచి భవిష్యత్తుకు తప్పకుండా మంచి అవకాశం వస్తుందనే ఆశ వారిలో వెలుగులీనుతోంది.
రచన: అంబాసిడర్ అశోక్ సజ్జనార్, మాజీ భారత దౌత్యవేత్త, ప్రెసిడెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ స్టడీస్