పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలు పొడిగిస్తూ, పాక్ ప్రధాని ఇమ్రాన ఖాన్, ఆగష్టు 19వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను, అనూహ్యంగా, పాకిస్థాన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. 59 సంవత్సరాల జనరల్ బిజ్వా పదవీ కాలం 28 అర్థరాత్రితో ముగియవలసి ఉంది. అయితే, చీఫ్ ఆఫ్ ఆర్మీ పదవీ కాలాన్ని పొడిగించడానికి సంబంధించి, పార్లమెంట్ చట్టాన్ని సవరిస్తామన్నహామీపై సుప్రీం కోర్టు, షరతులు విధిస్తూ అయన పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించింది.
ఇందుకు సంబంధించి దేశంలో చాలా వాడీ వేడి చర్చ జరిగింది. మరో వంక అటు సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం నడిచింది. చివరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి, జస్టిస్ సయీద్ ఖోసా సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం, అన్ని అంశాలను పరిశీలించి, నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం, ధర్మాసనం మొత్తం వ్యవహారం ఇటు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్’కు అటు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీలకు తలవంపులు తెచ్చే విధంగా తల్లకిందులుగా సాగిందని అభిప్రాయ పడింది. ఆర్మీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు ప్రతిపాదనపై ముందుగా మంత్రి వర్గం ఆమోదం పొందవలసిందని, ఆ తర్వాతనే ప్రధానమంత్రి, అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవలసిందని న్యాయ స్థానం ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇదిలా ఉంటేమరో వంక మంత్రి వర్గంలోని మొత్తం 25 మంది మంత్రులకు గానూ, కేవలం 11 మంది మాత్రమే పొడిగింపు ప్రతిపాదనను సమర్ధించారని, మిగిలిన మంత్రులు ప్రతిపాదన పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారని, వార్తా కథనాలు సుచ్సితున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు, సైనిక నిబంధనలో ‘పొడిగింపు’ అనే పదం లేదని, అలాగే, సైనిక నిబంధనలో ఎక్కడా కూడా ఆర్మీ చీఫ్ పదవీ కాలంపై స్పష్టత లేదని ధర్మాసనం పేర్కొంది.
న్యాయ స్థానం తీర్పు నేపధ్యంలో, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంత్రి వర్గాన్నివెంటనే సమావేశపరిచి, ముందు ఇచ్చిన ‘పొడిగింపు’ ఉత్తర్వులను ఉపసంహరించుకుని,ఆ వెంటనే,’పొడిగింపు’ పదాన్ని చేరుస్తూ పాకిస్థాన్ డిఫెన్సు సర్వీసెస్ రూల్స్’కు సవరణలు చేశారు. కాగా, జనరల్ బిజ్వా పదవీ కాలం పొడిగింపుకు పాక్ ప్రభుత్వం, “ప్రాతీయ భద్రతా పరిస్థితులు” కారణంగా చూపింది. అయితే, 3 సంవత్సరాలు పొడిగింపుకు అదే అసలు కారణమా? లేక ఇంకేదైనా కారణం దాగుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఎప్పుడూ కూడా పాకిస్థాన్ సుప్రీం కోర్టు, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ఇలాంటి తీర్పు ఇవ్వలేదు. గతంలో పలుమార్లు జరిగిన సైన్యం తిరుగుబాట్లను కూడా పాక్ సుప్రీం కోర్టు సమర్ధించింది. పౌర ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమినందునే సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చిందని సైన్యానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. గతంలో 9/11 సంఘటన అనంతరం జనరల్ ముషారఫ్ సాగించిన రాజ్యాంగేతర చర్యలను సైతం న్యాయస్థానం సమర్ధించింది. అంతే కాదు, ఎన్నికలు నిర్వహించేందుకు ఆయనకు మూడు సంవత్సరాల సమయం కూడా ఇచ్చింది. అలా, పాకిస్థాన్ ఏర్పడిన నాటి నుంచి నేటివరకు సగం కాలానికి పైగా ఆ దేశం సైనిక పాలనలోనే ఉంది. సైనిక ప్రభుత్వమే రాజ్యమేలింది. ఆ విధంగా దేశ రక్షణ, విదేశాంగ వ్యవహారాల్లో సైన్యం ప్రభావం సుస్థిరమైంది. కోర్టు తీర్పు కంటే, సైన్యాధికారి పదవీ కాలం ‘పొడిగింపు’ ప్రకటనను రద్దు చేయడం, మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఐదారుగు జనరల్స్’ తమ పదవీ కాలాన్ని తామే పొడిగించుకుంటూ తీసుకున్న నిర్ణయాల పట్ల న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ముందు అలా కుదరదు అని న్యాయ స్థానం త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.ఇది అనూహ్య పరిణామంగా పరిశీలకు భావిస్తున్నారు.
చట్టం విషయం ఎలా ఉన్నా, ఇద్దరు న్యాయమూర్తుల లెక్కకు రాని నిధులకు సంబందించిన కేసులో వారికి వ్యతిరేకంగా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా, సుప్రీం కోర్టు ప్రధానమంత్రి కార్యాలయానికి ఇబ్బందులు కలిగిస్తోందా, అని పరిశీలకులు అనుమానం వ్యక్త పరుస్తున్నారు.అదే విధంగా జడ్జిల నియామకం విషయంలో ప్రభుత్వ జోక్యం విషయంలో న్యాయ వ్యవస్థలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.మరో వంక చాలా వరకు రాజకీయ పార్టీలు కూడా, పొడిగింపును వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉంటే, జనరల్ ముషారఫ్ రాజద్రోహం కేసు రోజువారీ విచారణ కూడా డిసెంబర్ 5 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సైన్యానికి అమ్ముడుపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అలాగే, జనరల్ బజ్వా పదవీ కాలాన్ని 3స సంవత్సరాలు పొడిగించడం, సైన్యానికి ఇమ్రాన్ ఖాన్ కృతజ్ఞత చూపడంగా భావిస్తున్నారు.సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ అయిన వెంటనే, సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున వాదించేందుకు న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేయడం, ఆ వాదనకు బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రభుత్వం అపరిపక్వతకు అద్దంపడుతోంది. మరోవంక, పెషావర్ హై కోర్టులోనూ పొడిగింపును వ్యతిరేకిస్తూ పిటీషన్ దాఖలైంది. ఈ నేపధ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చివరకు ఏమౌతుంది,అనేది వేచి చూడవలసి వుంది.
ఆంగ్ల మూలం : అశోక్ హండూ, రాజకీయ విశ్లేషకులు