ఆర్థిక మంగమనాన్నినిలువరించి, తన పరిశ్రమకు మద్దతు విధానంతోపాటు కార్యక్రమాలను కొనసాగించే లక్ష్యంతో గణనీయమైన ప్రతయ్నంలో భాగంగా ప్రభుత్వం బుధవారం నాడు ఒక భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. దీనికింద రాగల ఐదేళ్లలో దేశంలోని మౌలిక సదుపాయ రంగంలో వంద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రైల్వేలు, వాణిజ్యం – పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ – ఇంత భారీ స్థాయి పెట్టుబడి వల్ల మౌలిక వసతుల లభ్యత, నాణ్యత గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేశారు. విమానయానం, నౌకాయానం రోడ్లు, రహదారులు, రైల్వేలు, రేవులే కాక విద్యుచ్ఛక్తి, చమురు, గ్యాసు రంగాలకు నూతనోత్తేజం లభించి వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా, సమర్థంగా తయారవుతుందన్నారు.
ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన రైల్వేనెట్ వర్కులతో అధిపతిగా వున్న భారత రైల్వేలు 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 12 సంవత్సరాల ప్రణాళికను రూపొందించిందని, మధ్యకాలానికి సంబంధించినంతవరకు ఇది ఊహకు కూడా అందనంతటి పెద్ద మొత్తమని పీయూష్ గోయల్ చెప్పారు. అయితే ఈ స్థాయిలో పెట్టుబడి ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదుకనుక తగిన ప్రోత్సాహకాలతో ప్రైవేటురంగానికి కూడా భాగస్వామ్యం కల్పించాల్సి వుంటుందని మంత్రి అన్నారు. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం సన్నిహితంగా పని చేస్తుందన్నారు.
2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలనే లక్ష్యసాధన ప్రయత్నంలో భాగంగా గడచిన ఐదేళ్లలో పెట్టుబడి వాతావరణాన్ని కల్పించేందుకై ప్రభుత్వం పలు ప్రధాన సంస్కరణలను అమలుచేసింది.
వీటి కింద 2016లో దివాళా – బాంకరప్సీ కోడ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళనం చేసి, వాటాదారుల డిమాండ్లను తీర్చేందుకు వీలుగా ఈ చర్యను చేపట్టారు. అలాగే వస్తు సేవల పన్ను జి.ఎస్.టి అమలు ద్వారా బహుళ పన్నులను రద్దు చేసి, కొద్ది రేట్ల ఒకే వ్యవస్థ కిందకు చేర్చారు. దీనిని సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచే దిశగా చేపట్టిన గట్టి చర్యగా చెప్పాలి. కాగా దేశంలో ప్రపంచ స్థాయి వస్తు సేవలను కల్పించేందుకు దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారత్ లో తయారీ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుంది.
ఇంకా మరీ ఇటీవలనే కార్పొరేటు పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. పెట్టుబడి కార్యకలాపాల పురోగతి కోసం ప్రభుత్వం గణనీయమైన ఈ చర్యను చేపట్టింది. మరీ ముఖ్యంగా కొత్త స్వదేశీ తయారీ కంపెనీలకు కార్పొరేట్ పన్నును ప్రపంచంలోనే అతి తక్కువగా 15 శాతానికి కుదించారు. ఈ తగ్గింపు 2019లో భారత రిజర్వుబ్యాంకు రెపో రేటులో 135 బేసిస్ పాయింట్ల తగ్గింపుకు కూడా తోడ్పడింది. ఇంకా మదుపుదారుల క్యాపిటల్ కాస్ట్ ను తగ్గించేందుకు విదేశీ పరిమితులకు అనుగుణంగా తమ రుణ రేట్లను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించడానికి దోహదం చేసింది. దీనివల్ల అధికార బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారా ఉత్పత్తి కలాపాల కోసం భారీ మొత్తంలో రుణాలు తీసుకొనే పెట్టుబడిదారులకు ఊరట లభిస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థపై చర్చకు సమాధానమిస్తూ – కనీస ప్రత్యామ్నాయ పన్ను – ఎమ్.ఏ.టి, డివిడెండ్ పంపిణీ పన్ను తగ్గుముఖం పట్టనున్నాయన్నారు. దీంతో తమ జంట డిమాండ్లకు 2020-21 బడ్జెట్ లో స్థానం దక్కవచ్చునని భారత కార్పొరేట్ సంస్థలలో ఆశలు చిగురించాయి. దీనిని బట్టి ఇంతవరకు ప్రకటించిన,ఇకపై ప్రకటించనున్న చర్యలను చూస్తూంటే స్వదేశీ పరిశ్రమకు అనుకూల మౌలిక సదుపాయ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని, ఇది ప్రభుత్వ ప్రాధామ్యమని ఖచ్చితంగా తెలుస్తుంది. ధరలు, నాణ్యత విషయంలో విస్తృతమైన స్వదేశీ మార్కెట్లలోనే కాక, విదేశీ మార్కెట్లలో కూడా పోటీకి దీటుగా నిలిచేందుకు దేశీయ పరిశ్రమకు ఊతం లభిస్తుంది.
ఆర్థిక సర్వేలో వెల్లడించిన విధంగా దేశంలో మౌలిక సదుపాయ పెట్టుబడికి, ఆర్థికాభివృద్ధికి నడుమ పొంతన లోపించి, అగాధం ఏర్పడిందనే కఠోర వాస్తవం నుండి ప్రభుత్వం తప్పించుకోజాలదని నిస్సందేహంగా చెప్పవచ్చు. స్వదేశంలో రోడ్డు, రైలు, విమానాశ్రయ రంగాల్లో మౌలిక సదుపాయాల పెట్టుబడికి స్థూల జాతీయోత్పత్తికి మధ్య వ్యత్యాసం 0.90 కు మించి వుందని, ఈ రెండింటి మధ్యన గల భారీ వ్యత్యాసాన్ని ఇది సూచిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. అందుచేత లక్షిత ఆర్థిక వృద్ధి సాధనకై సకల సాధనాలతో, సర్వ సన్నద్ధంగా ఆయత్తమైన ప్రభుత్వం మౌలిక సదుపాయ రంగంపై భారీ పెట్టుబడులు పెట్టక తప్పదని, ఇది అత్యంత ఆవశ్యకమని విశ్లేషకులు చెబుతున్నారు.
రచన : జి.శ్రీనివాసన్, సీనియర్ ఎకనామిక్ జర్నలిస్ట్