దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణ దిశగా అడుగులు వేస్తోందని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. GDP వృద్ధిరేటు మందగమనం సాగిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి, రాన్నున్న ఐదేళ్ళలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల శిఖరానికి చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల మరో మారు సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని, రానున్న సంవత్సరాలలో ఫలితాలు అందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.
వందేళ్ళు పూర్తిచేసుకున్న, అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ASSOCHAM వార్షిక సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కుదించుకు పోతోందన్న భావనను తొలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బలమైన వాదనను వినిపించారు.
నిజానికి గడచిన ఐదు త్రైమాసికాలలో, GDP వృద్ధి రేటు కుదించుకు పోవడం గురించి చాలామంది చాలా చెప్పారు.అయితే, ఇందుకు అంతర్జాతీయ పరిణామలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం కూడా కారణం. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం సాగుతోంది.భారత దేశ ఆర్థిక వ్యవస్థపై, అది ప్రభావం చూపుతోంది. ఇది కాదన లేని నిజం. అంతే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వసూలు కాని ‘బ్యాడ్ లోన్స్’ భారానికి తీవ్రంగా కృంగి పోయిన ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా అందుకున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరర్ధక ఆస్తుల – NPA – సమస్యతో సతమవుతున్నాయి. బ్యాడ్ లోన్స్ , నిరర్ధక ఆస్తుల కారణంగా బ్యాంకులు పరిశ్రమలకు అవసరమైన మేరకు రుణాలు ఇవ్వలేని పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి.ఫలితంగా ఆర్థిక కార్యకలాపాల పరిధి కుదించుకు పోయింది. ఈ నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పడం సహేతుకం, సమర్ధనీయం. రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో ఇంతవరకు అరడజనుకు పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమస్య నుంచి బయటకు వచ్చాయని, ప్రధానమంత్రి చెప్పారు. ఇది నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న శుభ పరిణామం.
గడచిన ఐదు సంవత్సరాలలో NDA ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో ఆరోగ్యకరమైన పోటీని పెంచేందుకు, బ్యాంకుల విలీన ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఆ విధంగా బ్యాంకుల విలీన ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ASSOCHAM సమావేశంలో ప్రధానమంత్రి, వసూలుకాని బ్యాడ్ లోన్స్ పేరుకు పోవడం వలన బ్యాంకింగ్ రంగం రుణ వితరణ సామర్ధ్యం తరిగిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే సమస్యల గురించి చాలా విపులంగా ప్రసంగించారు. ప్రధాన మంత్రి చెప్పిన దాంట్లో నిజముంది. ఒకటి రెండు కాదు, అనేక కార్పొరేట్ సంస్థలు బ్యాంకు రుణ బకాయిలను తిరిగి చెల్లించక పోవడం వలన, ఆర్థిక వ్యవస్తలో ద్రవ్య లభ్యత పరిమాణం తరిగిపోయింది.
ఎస్సార్ స్టీల్, దివాలా ప్రక్రియను ముగించడం ద్వారా, కంపెనీ రుణ చెల్లింపుల సమస్య విజయవంతంగా పరిష్కారమైంది. దీంతో, బ్యాంకింగ్ సంస్థలకు గొప్ప ఉపసమనం లభించింది. ఈ నేపధ్యంలోనే ప్రధానమంత్రి తమ ప్రబుత్వం తీసుకున్న దిద్దుబాటు చర్యలు ఇప్పుడుప్పుడే ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. “2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికి దేశ ఆర్ధిక వ్యసస్థ, విపత్తు దిశగా పరుగులు తీస్తోంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను సుస్థిర స్థితికి తీసుకు రావడంతో పాటుగా, అవసరమైన ఆర్థిక క్రమశిక్షణ తీసుకు వచ్చాము. పరిశ్రమ దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం ప్రారంభించాము” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం పరిశ్రమ వర్గాల మాట వింది, కార్పొరేట్ టాక్స్ తగ్గింపే అందుకు నిదర్శనం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను ప్రోది చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి చెప్పారు. వస్తు సేవల పన్ను – GST- కూడా అందులో భాగమేనని పప్రధానమంత్రి వివరించారు.
సులభ వాణిజ్యం, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’లో 2014లో భారత దేశం స్థానం మొత్తం 190 దేశాల పట్టికలో 142. ఇప్పుడది 63. ఇది ప్రభుత్వం పారదర్శకతకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు అవసరమైన అనుమతుల మంజూరులో పెరిగిన వేగానికీ .. ఇది నిదర్శనం, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదే విధంగా కార్మిక చట్టాలలోనూ పరిశ్రమ అనుకూల సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు.
అదే విధంగా రుణ విముక్తి, దివాలా నిబంధనలకు చేసిన సవరణల ద్వారా ప్రభుత్వం బ్యాంకులు, పరిశ్రమల ప్రయోజనాల పరిరక్షణకు భరోసాను కలిపించింది. ఇది ఆర్థిక వ్యవస్థకు పుష్టిని చేకూరుస్తుంది.
ఆర్థిక వ్యవస్థను రానున్న ఐదేళ్ళలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి విస్తరించేందుకు పెట్టుకున్న లక్ష్యం,ఎంతో అలోచించి తీసుకున్న నిర్ణయమని, ఖాయంగా లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధానమంత్రి సంపూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. అదే విధంగా తమ ప్రభుత్వం గతంలో నిర్దేశించుకున్నలక్ష్యాలను చేరుకుందని, అందుకు స్వచ్చ భారత్’ విజయమే సంకేతమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రచన: మనిష్ ఆనంద్, సీనియర్ స్పెషల్ కరెస్పాండంట్, ది న్యూ ఇండియన్ఎక్ష్ప్రెస్స్