శ్రీలంక విదేశీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి,ఉపాధి కార్మిక శాఖ మంత్రి దినేష్ గుణ వర్ధన తమ తొలి విదేశీ పర్యటన గా భారత్ ను సందర్శించారు. ఆయన వెంట నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి ప్రతినిది బృందం ఉంది. రెండు వేల పందొమ్మిది నవంబర్లో శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్షే పర్యటన కొనసాగింపుగా, విదేశాంగ మంత్రి పర్యటన జరిగింది. ఈ పర్యటన సందర్భంగా ఆయన తమ భారత సహచర మంత్రులతో చర్చలు జరిపారు. వారిలో విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, నైపుణ్యాభివృద్ధి మంత్రి మహేంద్ర నాథ్ పాండే,భారత కార్మిక ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ ఉన్నారు .ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఎఫ్ఐసిసిఐ, సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు . న్యూఢిల్లి స్థావరంగా ఉన్న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వీ రాన్మెంట్, న్యూఢిల్లీ సెంటర్ ఆఫ్ ది మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియాలను కూడా ఆయన సందర్శించారు.
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిర్వహించిన ప్రతినిధి స్థాయి చర్చల సందర్భంగా ఇరువురు మంత్రులు పెట్టుబడి, భద్రత, మత్స్య పరిశ్రమ, అభివృద్ధిలో సహాయం, కొనసాగుతున్న ప్రాజెక్టులు, పర్యాటక, విద్య, సాంస్కృతిక రంగా లతోసహ పలు ద్వైపాక్షిక సంబంధాల పై పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. భారత్ శ్రీలంక దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే విధానాలను ప్రస్తావించారు. అధ్యక్షుడు రాజపక్షే తొలి పర్యటన సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ, సామర్థ్య పెంపుదల రంగాలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశ సహకారంపై కొత్త రంగాల అన్వేషణ కొనసాగించాలన్న ఆశయాన్ని ఆ దేశ
విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. ఆయా రంగాలలో భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని డాక్టర్ జయశంకర్ హామీ ఇచ్చారు. ఈ రంగాల్లో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. వాతావరణ మార్పు,ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంతొ సహా పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై వారిరువురు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు .
శ్రీలంక ఆధీనంలో ఉన్న పదిహేను మంది భారతీయ మత్స్యకారులను యాభై రెండు పడవలను విడుదల చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు గోతబయ రాజపక్ష చేసిన ప్రకటన దరిమిలా ఈ దిశలో సాగిన విడుదల ప్రక్రియ లోని ప్రగతి ని డాక్టర్ జయశంకర్ తెలుసుకున్నారు.ఈ విషయంలో ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు శ్రీలంక పక్షం తెలయజేసింది. మీడియాలో తెలిపినట్లుగా భారతదేశంలో నివసిస్తున్న శ్రీలంక శరణార్థులు తిరిగి ఆ దేశానికి రావడంపై చర్చలు జరిగేయి.
తమ మాతృదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న సుమారు మూడు వేల మంది శ్రీలంక శరణార్థులకు సమ్మతి తెలుపుతూ, సంబంధిత జిల్లా సచివాలయాల ద్వారా అవసరమైన సౌకర్యాలను కలగజేయడానికి అంగీకరించినట్లు, శ్రీలంకకు తిరిగి వచ్చిన తరువాత మంత్రి గుణ వర్తన మీడియాకు తెలియజేశారు. ఫిబ్రవరిలో శరణార్థుల మొదటి బృందం శ్రీలంక చేరుకుంటుందని భావిస్తున్నారు. వారి గుర్తింపును ధ్రువీకరించిన తరువాత వారి పునరావాసానికి తగు ఏర్పాట్లు చేయబడతాయని శ్రీలంక మంత్రి తెలిపారు. భారత్ లో నివసిస్తున్న శ్రీలంక శరణార్ధుల పునరాగమనంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని గమనించాలి. ఇప్పటివరకు శ్రీలంకకు వారు తిరిగి రావడానికి యుఎన్ హెచ్ ఆర్సీ స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసింది. శరణార్థుల పునరావాసానికి తగిన ఏర్పాట్లు లేనప్పుడు చాలా మంది తిరిగి తమ దేశాలకు వెళ్లడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా గుణవర్ధన మీడియా ప్రకటన ఒక స్వాగతించదగిన పరిణామం.
రచన : గుల్ బిన్ సుల్తానా, పరిశోధన విశ్లేషకులు ఐడిఎస్ఎ .