భారత్ , బ్రెజిల్ దేశాలు రెండూ అత్యంత శక్తివంతమైన,బలమైన,ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు.చైనా తర్వాత అగ్రరాజ్య హోదాను సాధించగల శక్తి సామర్ధ్యాలు ఉన్న దేశాలు.అయితే ఇటీవలకాలం వరకు భారత దేశం పేదరికానికి, హిందూ అభివృద్ధి రేటుకు నిర్వచనంగా నిలిస్తే, బ్రెజిల్ భారీ ద్రవ్యోల్బణం, రుణ విష్పోటనకు పర్యాయ పదంగా నిలిచింది. భారత దేశం ప్రప్రంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ, భారత దేశం అంటే పాములు ఆడించే పామరుల దేశంగా, మార్మిక సాధువుల దేశంగానే పాశ్చాత్య ప్రపంచం గుర్తించింది.అలానే చూసింది.ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డే గయుల్లే అయితే, “బ్రెజిల్’ అసలు దేశమే కాదు”, ఆ దేశాన్ని ఒక దేశంగా పరిగణించవలసిన అవసరమే లేదు అని తూలానాడారు. అంతే కాదు, “బ్రెజిల్ రేపటి దేశం, ఎప్పటికీ ఆలాగే రేపటి దేశంగానే ఉంటుంది” అని అన్నారు. అయితే, ఈనాడు భారత్, బ్రెజిల్ దేశాలు రెండూ అడుగులు ముందుకు వేశాయి, సమతుల్యసాధన దేశాల స్థాయి నుంచి ప్రపంచ ప్రధమ శ్రేణి దేశాల స్థాయికి చేరుకున్నాయి. గత దశాబ్దకాలంలో లేదా అందుకు కొంచెం అటూ ఇటుగా, రెండు దేశాలు ద్వైపాక్షిక, బహుముఖ వేదికల ద్వారా అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్రను పోషించే విధంగా విదేశాంగ విధానాలను మెరుగు పరచుకున్నాయి.
ఈ నేపధ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బోల్సోనారో నాలుగు రోజుల భారత పర్యటన ఒక చారిత్రక సందర్భంగా పేర్కొనవచ్చును. బోల్సోనారో భారత 71వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొనేందుకు భారత దేశం వచ్చారు. ఇది, ఉభయ దేశాల మధ్య వికసిస్తున్న భాగస్వామ్యానికి గుర్తింపుగా నిలిచి పోతుంది.అందకే భారత వ్యూహాకర్తలు, భారత్,బ్రెజిల్ బంధంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.భారత్,బ్రెజిల్ కేవలం సుస్థిర ప్రజాసామ్య దేశాలు మాత్రమే కాదు, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిపుష్టిగల దేశాలు.భారత దేశంలానే బ్రెజిల్ కూడా ఇటీవల కాలంలో అంతర్జాతీయ వ్యవహారాల్లో, ప్రపంచ దౌత్య వ్యవహారాల్లో ముందడుగు వేసింది. వేగంగా ముందుకు కదులుతోంది. బ్రెజిల్ చాలాకాలం పాటు అంతర్లీన, అంతర్ముఖ విదేశాంగ విధానాలను అనసరిస్తూ వచ్చింది. ఇప్పుడు, అందుకు విరుద్ధంగా, ప్రపంచ వేదికపై కీలక భూమికను పోషించే విధంగా బహుముఖ సంస్థలు, వేదికలను చక్కగా, చాకచక్యంగా వినియోగించుకుంటోంది.
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య ఆతిదిగా పాల్గొంటున్న బ్రెజిల్ అధ్యక్షులలో బోల్సోనారో మూడవ వారు. 1996లో అప్పటి బ్రెజిల్ అధ్యక్షుడు ఫెర్నాండో హెన్రిక్యూ కార్దోసో, 2004లో అప్పటి అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో డిసిల్వా , ‘లుల’ భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014లో ఫోర్తలేజాలో, 2019లో బ్రసిల్లాలో జరిగిన బ్రిక్స్ సదస్సులలో పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలలకు విదేశీ దేశాధినేతలను, ప్రభుత్వాధినేతలను ఆహ్వానించడం వ్యూహాత్మక ఎంపికగా భావిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు బోల్సోనారో అంతర్జాతీయ, ద్వైపాక్షిక ప్రాధాన్యతగల వివధ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ బ్రెజిల్ అధ్యక్షుని గౌరవార్ధం విందు ఇచ్చారు.
ఉభయ దేశాలు డజనుకు పైగా ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో, ద్వైపాక్షిక పెట్టుబడుల సహకార ఒప్పందం, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఒకటిగా ఎదుర్కునే ఒప్పందమ తో పాటుగా చమురు, సహజవాయువు, ఖనిజ వనరులు, సంప్రదాయ ఔషధాలు, పశుసంవర్ధనం, జీవఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు సహా విస్తృత రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వీలుకలిపించే ఒప్పందాలు ఉన్నాయి. అధ్యక్షుడు బోల్సోనారో భారత్, బ్రెజిల్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించారు.ఆయన వెంటవచ్చిన ఏడుగురు మంత్రులు, సంబదిత శాఖల మంత్రులతో చర్చలు జరిపారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధలలను మరో మెట్టు పైకి తీసుకుపోయే విధంగా రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు.
బోల్సోనారో బ్రెజిల్ అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలో, ఆయన విదేశాంగ విధానంలో అంతర్ముఖంగా అడుగులు వేస్తారని “యూరప్, ఉత్తర అమెరికా” దేశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, విశ్లేషకులు భావించారు.ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన ప్రకటనలు, వ్యాఖ్యల ఆధారంగా, బ్రెజిల్ బ్రిక్స్ సమ్మేళనం పట్ల పెద్దగా శ్రద్ద చూపక పోవచ్చనీ అనుకున్నారు. అయితే, అందుకు భిన్నంగా బోల్సోనారో కొద్ది నెలల క్రితం బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించారు.చైనాలోనూ పర్యటించారు.మరో వంక భారత్, బ్రెజిల్ దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా అంతర్జాతీయ పరిణామాల నుంచి ఉభయ దేశాలు ప్రయోజనం పొందే విధంగా విదేశాంగ విధానాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితిని, “బహుముఖ” ప్రపంచంగా, “బహు…బహుముఖ” ప్రపంచంగా పేర్కొంటున్నారు. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచ దేశాలు కొత్త కూటములను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ఇటీవల కాలంలో వాణిజ్యం, పెట్టుబడులకు ప్రాధాన్యత పెరిగింది.ఉభయ దేశాల మధ్య వాణిజ్యం 8.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత్ దేశం బ్రెజిల్’కు 3.8 బిలియన్ డాలర్ల విలవైన వస్తువులను ఎగుమతి చేస్తోంది.అలాగే, బ్రెజిల్’లో భారత పెట్టుబడులు, ముఖ్యంగా ఐటీ, ఔషధాలు, ఇంధనం, వ్యవసాయ వాణిజ్యం, గనులు, ఇంజనీరింగ్ రంగాలలో దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నాయి.ఇరు దేశాల మధ్య వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు ఉద్దేశించిన ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఈ కార్యాచరణ ఆవిష్కరణ పట్ల ఉభయ దేశాలు సంతృప్తిని వ్యక్తపరిచాయి.
బ్రిక్స్, జీ-20, IBSA వేదికల ద్వారా ఉభయ దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో తరచూ చర్చలు జరుగతున్న ఫలితంగా భారత్, బ్రెజిల్ సంబంధాలు రోజు రోజుకు మరింతగా బలోపేతం అవుతున్నాయి. ఈ ప్రస్థానం మరింత వేగంగా, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచే విధంగా మలచుకునేందుకు ఉభయ దేశాలు మరింత గట్టిగా అడుగులు వేయవలసి ఉంటుంది.
రచన :డాక్టర్ ఆష్ నారైన్ రాయ్, డైరెక్టర్,ఇన్స్టిట్యూట్ అఫ్ సోషల్ సైన్సెస్, ఢిల్లీ