భారత ప్రధాన మేధోమథన నిలయమైన “మనోహర్ పరికర్ రక్షణాధ్యయన-విశ్లేషణ సంస్థ” న్యూఢిల్లీలో ‘పశ్చిమాసియా నాలుగో మహాసభ’ను నిర్వహించింది. “పశ్చిమాసియాలో పదేళ్ల రాజకీయ-ఆర్థిక పరివర్తన: సవాళ్లు… పాఠాలు… భవిష్యత్ ధోరణులు” ఇతివృత్తంగా సాగిన మహాసభలో అనేక ముఖ్యమైన అంశాలపై ప్రముఖులు చర్చించారు. లెబనాన్ మాజీ ప్రధానమంత్రి ఫువాద్ సిన్యూరా, ఈజిప్టు విదేశాంగ శాఖ మాజీ మంత్రి నబీల్ ఫ్యామీసహా జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పలువురు ఇందులో పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఆరు విడతలుగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో- ప్రాంతీయ భద్రత నేపథ్యం, బాహ్యశక్తుల పాత్ర, ఆర్థిక వ్యవస్థ, వైరుధ్య స్వభావంలో మార్పులు-పశ్చిమాసియాతో పెరుగుతున్న భారత మైత్రివంటి అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ తరఫున పాల్గొన్న కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారులశాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ విజయకుమార్ కీలకోపన్యాసం చేశారు. గడచిన దశాబ్దంగా పశ్చిమాసియాలో తలెత్తిన ఉపద్రవాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ ప్రాంతానికి భారత్ అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నదని వివరించారు. మరోవైపు నిత్య అనిశ్చితి ఫలితంగా ఈ ప్రాంత ఆర్థిక ప్రగతి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదని మనోహర్ పరికర్ సంస్థ డైరెక్టర్ జనరల్, మాజీ దౌత్యవేత్త సుజన్ R.షెనాయ్ స్పష్టం చేశారు. అయితే- పటిష్ఠ భద్రత, వాణిజ్యం-పెట్టుబడుల భాగస్వామ్యాలద్వారా భారతదేశం ఈ ప్రాంతంతో తన వ్యూహాత్మక సంబంధాలను విస్తరిస్తున్నదని ఆయన విశదీకరించారు.
పశ్చిమాసియాను దశాబ్దం నుంచీ కుదిపేస్తున్న ఉపద్రవాలను పలువురు వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. సుదీర్ఘ అనిశ్చితికి పరిష్కారాన్వేషణ దిశగా ఈ ప్రాంతంలోని నేతలతోపాటు ప్రజలు కూడా మేధోమథనం చేయాలని వారు ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. టునీషియాలో 2010 డిసెంబరునాటి ‘అరబ్ అలజడి’ తర్వాత ఈ ప్రాంతంలో భద్రత దిగజారిందని కొందరు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడటంతోపాటు భౌగోళిక-రాజకీయ స్పర్థను ముమ్మరం చేసిందని వారు పేర్కొన్నారు. అయితే, “సార్వజనీన-జవాబుదారీ పాలన లక్ష్యంగా నిరంకుశత్వం నుంచి ప్రజాస్వామ్యంవైపు పరివర్తన” డిమాండ్తో అరబ్ అలజడి మొదలైందని మరికొందరు పేర్కొన్నారు. కానీ, ఈ ప్రాంతంలోని దేశాల్లో అధికశాతం దశాబ్దం కిందటి అదే సమస్యలతో నేటికీ సతమతం అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అనేక దేశాల్లో భాగస్వామ్య రాజకీయాలవైపు పరివర్తన ప్రక్రియ అత్యంత బాధాకరంగానూ, అసంపూర్ణంగానూ ఉందని పేర్కొన్నారు. సిరియా, యెమెన్, ఇరాక్, లిబియావంటి దేశాల్లో తీవ్ర అంతర్గత వైరుధ్యాలతో తలెత్తిన కనీవినీ ఎరుగని మానవతా సంక్షోభం, పెద్దసంఖ్యలో జనాభా వలసలే ఇందుకు నిదర్శనమని వివరించారు.
ఈ పరిణామాల ఫలితంగా గడచిన సంవత్సర కాలంనుంచీ అల్జీరియా, సూడాన్, లెబనాన్, ఇరాన్ తదితర దేశాల్లో వినూత్న ప్రజాందోళన సాగుతోంది. యువతరం ఆశిస్తున్న ప్రాథమిక రాజకీయ, ఆర్థిక ఆకాంక్షలు కూడా నెరవేరని పరిస్థితులను ఈ ఆందోళన ప్రతిబింబిస్తోంది. ఈ అనిశ్చితి పర్యవసానంగా ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతింటోంది. పశ్చిమాసియా జనాభాలో అధికశాతం యువతరమే అయినప్పటికీ నేడు- ప్రపంచంలో నిరుద్యోగం అత్యధికంగా, తలసరి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అత్యల్పంగాగల ప్రాంతాల్లో ఇదీ ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా ఆర్థిక అంచనాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో నిరంతర అనిశ్చితి, హింసకు ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు తోడయ్యాయి. దీంతో భారత్, జపాన్, దక్షిణ కొరియా, చైనాలాంటి చమురు దిగుమతి దేశాల్లో ఇంధన భద్రత ప్రధాన సమస్యగా మారింది. భారత్ దృక్కోణంలో ఈ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యముంది… పశ్చిమాసియాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగా, అందులో ఇంధన అవసరాల కోసం దిగుమతుల వాటా 60 శాతానికిపైగా ఉంటుంది. అలాగే గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న 90 లక్షల మందికిపైగా భారతీయుల రక్షణ, భద్రత కూడా భారతదేశానికి ఆందోళనకర అంశం. ప్రాంతీయ భద్రతకు ఏదైనా సవాలు ఎదురైనా, పశ్చిమాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడినా భారత ఆర్థిక వ్యవస్థ, భద్రతపై ప్రత్యక్ష ప్రభావం తప్పదు. కాబట్ట్టి తన ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా భారతదేశం 2014 నుంచీ చురుకైన దౌత్య విధానాన్ని అనుసరిస్తోంది.
ఈ ప్రాంతంతో సంబంధాల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానంలోని అత్యంత కీలకాంశాలలో ఒకటి. ఆ మేరకు భారత విదేశీ విధానంలో “పశ్చిమంపై దృష్టి” కాస్తా “పశ్చిమంతో అనుబంధం-ఆచరణ”గా పరివర్తితమైంది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంతో రాజకీయ సంబంధాల తరచుదనమే ఈ అంశాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. తదనుగుణంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, భద్రతరంగాల్లో సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. వివిధ స్థాయులలో చర్చలద్వారా ఈ ప్రాంతంలోని పలు దేశాలతో తన సంబంధాలను భారత్ విస్తరించుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు యువతరం ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, తమ విధానాలను రూపొందించుకోవాలని పలువురు వక్తలు సూచించారు. ఈ దిశగా పదేళ్లకాలంలో తగిలిన గాయాల అనుభవాలు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కృషిలో భాగంగా పశ్చిమాసియా ముందడుగుకు, ప్రజల ప్రగతికి భారత్ తన తోడ్పాటును కొనసాగించనుంది!
రచన: డాక్టర్ మొహమ్మద్ ముదస్సిర్ ఖౌమర్, పశ్చిమాసియా వ్యూహరచనా విశ్లేషకులు